తెలంగాణ పాలిటిక్స్‌లోకి ‘మాస్టర్ మైండ్’ రీ ఎంట్రీ.. CM రేవంత్‌కు కీలక సూచనలు..!

by Disha Web Desk 19 |
తెలంగాణ పాలిటిక్స్‌లోకి ‘మాస్టర్ మైండ్’ రీ ఎంట్రీ.. CM రేవంత్‌కు కీలక సూచనలు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వ్యూహాలు రచించిన కాంగ్రెస్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ఆయన సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తొలుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమైన ఆయన.. అనంతరం పొంగులేటితో కలిసి సీఎం ఛాంబర్‌లో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

హైకమాండ్ నిర్ణయంలో మార్పు..?

సౌత్ ఇండియాలో కీలకంగా ఉన్న కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా వ్యూహరచన చేసిన సునీల్ కనుగోలు సేవలను సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉపయోగించుకోవాలని ఆ పార్టీ అధిష్టానం తొలుత భావించింది. కానీ పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆయన సేవలను కేవలం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం చేయాలనే నిర్ణయానికి వచ్చిందని ఈ మేరకు మీడియాకు లీకులు వచ్చాయి. ఇంతలో అనూహ్యంగా తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రత్యక్షం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.

ఇది కూడా రేపు ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హజరవుతున్న కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశానికి ముందురోజు రేవంత్ రెడ్డి, కనుగోలు భేటీ జరగడం ఇంటర్నెల్‌గా కాంగ్రెస్‌లోనూ ఉత్కంఠగా మారింది. లోక్ సభ ఎన్నికల్లో 12 సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని హస్తం నేతలు పని చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టాలంటే తెలంగాణ రాష్ట్రం పట్ల, పార్టీ సంస్థాగత అంశాల పట్ల మంచి పట్టు ఉన్న సునీల్ కనుగోలు వ్యూహాలు ఉపయోగపడతాయని అధిష్టానం భావిస్తున్నదా? అందులో భాగంగానే మళ్లీ రంగంలోకి దింపిందా అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

సీఎంకు కీలక సూచనలు!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో సునీల్ కనుగోలు పాత్ర కీలకంగా వ్యవహరించిందనే టాక్ ఉంది. హ్యాట్రిక్ కొట్టాలన్న బీఆర్ఎస్ ఆశలకు గండి కొట్టిస్తూ రాష్ట్రంలో కేసీఆర్‌పై తిరుగులేని వ్యూహాలు రచించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, మేనిఫెస్టో వరకు కాంగ్రెస్ పార్టీలో సునీల్ కనుగోలు కీ రోల్ పోషించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ హామీలపై ప్రతిపక్షాలు విమర్శల పర్వం ప్రారంభించాయి.

దీంతో పార్లమెంట్ ఎన్నికల వరకు ముఖ్యమైన స్కీమ్‌లకు శ్రీకారం చుట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో ఆరు గ్యారెంటీల పథకాల అమలులో అనుసరించాల్సిన వ్యూహాల విషయంలో సునీల్ కనుగోలు ముఖ్యమంత్రికి కీలక సూచనలు చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. వీటితో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన వద్ద ఉన్న డేటా ఆధారంగా నామినేటెడ్ పదవుల పంపకాల విషయంలో అనుసరించాల్సిన విధానాలను సైతం సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది.

Read More..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ట్రెసా కీలక రిక్వెస్ట్

Next Story

Most Viewed